శ్రీరామ నవమి సందర్భంగా చెలరేగిన హింసపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. శ్రీరాముడి ఆలోచనకే ఇవి వ్యతిరేకమని అన్నారు. మధ్యప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను చూసి శ్రీరాముడే
విసిగెత్తిపోయాడని ఎద్దేవా చేశారు. దేశంలో మతకల్లోలాలను రేకెత్తించి, ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నదే బీజేపీ వ్యూహమని ఆయన సామ్నా వేదికగా ఆరోపించారు. ఇలా మతకల్లోలాలను రేకెత్తించి, రెండో దేశ విభజనకు బీజాలు వేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకు పూర్వం శ్రీరామ నవమి వేడుకలు సంస్కృతికి వారధిగా ఉండేవని, ఇప్పుడు మత విద్వేషాలకు ఆలవాలమైందని విమర్శించారు.
రామ మందిర ఉద్యమాన్ని మధ్యలోనే నిలిపేసిన వారే, ఇప్పుడు శ్రీరాముడి పేరుతో కత్తులు దూస్తున్నారని ఎద్దేవా చేశారు. వీరు చేస్తున్న పనిని హిందుత్వ అని అనరని, ఇలాంటి పనులు శ్రీరాముడి ఆలోచనలకే విరుద్ధమని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ‘అసలు రామనవమి రోజు ఎందుకు హింస జరిగింది? ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా సొంత ఇలాఖా అయిన గుజరాత్లో శ్రీరామ నవమి యాత్రపై ముస్లింలు దాడి చేస్తారని ఎవరైనా నమ్ముతారా?’ అంటూ సంజయ్ రౌత్ ప్రశ్నించారు.