RG Kar Hospital | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకార్ వైద్య కళాశాల (RG Kar Hospital) ట్రెయినీ డాక్టర్పై లైంగిక దాడి, హత్య కేసులో కోల్కతా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్ (Sanjay Roy)ను న్యాయస్థానం శనివారం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అతడికి కోల్కతాలోని సీల్దా కోర్టు శిక్ష ఖరారు చేసింది. దోషి సంజయ్ రాయ్కి జీవితఖైదు (life term) విధించింది. అతడికి రూ.50 వేలు జరిమానా కూడా విధించింది. అంతేకాదు బాధిత కుటుంబానికి రూ.17లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దోషికి మరణశిక్ష విధించాలంటూ వైద్యురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, 2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాగా ఆర్జీకార్ దవాఖాన డాక్టర్లు, వైద్య విద్యార్థులు సుదీర్ఘకాలం ఆందోళనలు నిర్వహించారు. ఘటన అనంతరం ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును సీబీఐ విచారించింది. ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్ పేరును ఛార్జ్షీట్లో చేర్చి కోర్టుకు సమర్పించింది. దీనిపై గత వారం విచారణ జరిపిన కోల్కతాలోని సీల్దా కోర్టు.. సంజయ్ రాయ్ని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు ఇవాళ దోషికి శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.
మరోవైపు కోర్టులో విచారణ సందర్భంగా సంజయ్ రాయ్ తాను నిర్దోషినని, ఈ కేసులో తనను ఇరికించారని చెప్పాడు. తనను ఈ కేసులో ఇరికించిన ఐపీఎస్ అధికారితోసహా అందరినీ ఎందుకు విడుదల చేశారని అతను ప్రశ్నించాడు. ఈ కేసులో సాక్ష్యాలను మార్చినందుకు ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తోపాటు స్థానిక పోలీసు స్టేషన్ మాజీ ఎస్హెచ్ఓకు బెయిల్ ఇవ్వడాన్ని రాయ్ ప్రశ్నించాడు.
న్యాయమూర్తి తీర్పును ప్రకటించిన అనంతరం పోలీసులు దోషిని కోర్టు రూము నుంచి గట్టి బందోబస్తు మధ్య ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్కు తరలించారు. న్యాయమూర్తి తీర్పు విని బాధితురాలి తండ్రి భావోద్వేగానికి గురై విలపించారు. న్యాయవ్యవస్థపై తాము ఉంచుకున్న నమ్మకాన్ని న్యాయస్థానం నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. తన చార్జిషీటులో నగర పోలీసు శాఖలో సివిక్ వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ను ఈ కేసులో ప్రధాన, ఏకైక అనుమానితుడిగా దర్యాప్తు సంస్థ సీబీఐ పేర్కొంది. నిందితుడికి మరణ శిక్ష విధించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది.
Also Read..
ఆర్జీ కర్ డాక్టర్ రేప్ కేసులో సంజయ్ రాయ్ దోషి
“Doctors Protest | దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన.. రోగుల అవస్థలు”