ముంబై : రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు కోసం కాషాయ పార్టీ ప్రలోభాలకు తెరలేపుతోందని శివసేన నేత సంజయ్ రౌత్ శనివారం ఆరోపించారు. పెద్దల సభలో తమ అభ్యర్ధులు విజయం సాధించేలా బీజేపీ బేరసారాలకు దిగుతుందని, దీన్ని నివారించేలా ఎన్నికలు వాయిదా వేయాలని తమ పార్టీ కోరుకుంటోందని శివసేన నేత వ్యాఖ్యానించారు.
రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసేలా కాషాయ పార్టీ ధన బలం, కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల ద్వారా ప్రత్యర్ధుల అణిచివేతకు పూనుకుంటోందని మండిపడ్డారు. బేరసారాలకు తావు లేకుండా ఉండేందుకు రాజ్యసభ ఎన్నికల తేదీలను వాయిదా వేయాలని తాము కోరుతున్నామని అన్నారు. ఇక రాజస్ధాన్లో నాలుగు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరగనుండగా ఎన్నికలకు ముందు 80 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఉదయ్పూర్లోని ఓ హోటల్లో క్యాంపు నడుస్తోంది.
బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయవచ్చనే ఆందోళనతో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ సహా పలు ప్రత్యర్ధి పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్న నేపధ్యంలో కాషాయ పార్టీపై సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.