మహారాష్ట్రలో మూడు పార్టీలతో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం సాగుతోందని, నాలుగో పార్టీకి కలుపుకునే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎంతో శివసేన పొత్తు పెట్టుకోనుందన్న వార్తల నేపథ్యంలో రౌత్ పై వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఛత్రపతి శివరాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ విలువల ఆధారంగా ఏర్పడ్డ పార్టీ అని, వాటినే కొనసాగిస్తామన్నారు. ఔరంగజేబుల భావజాలం వున్న వారితో ఎలా కలుస్తామని ప్రశ్నించారు. ఇంతటి సాధారణ విషయాన్ని కూడా ఆలోచించరా? అని రౌత్ సూటిగా ప్రశ్నించారు. తమ సిద్ధాంత భూమికపై బీజేపీ చాలా ప్రశ్నలు వేస్తోందని, జమ్మూ కశ్మీర్లో మెహబూబా ముఫ్తీతో జట్టు కట్టినప్పుడు బీజేపీ సిద్ధాంతం ఎటు పోయిందని రౌత్ సూటిగా నిలదీశారు.
మహావికాస్ అగాఢీలోకి ఎంఐఎం వచ్చి చేరుతుందన్న వార్తలు కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని శివసేన తీవ్రంగా ఖండిస్తూనే వస్తోంది. అటు సీఎం ఉద్ధవ్, ఇటు ఎంపీ రౌత్ పదే పదే ఈ విషయంపై ప్రకటనలిస్తూనే వున్నారు. తాము ఎంఐఎంతో పొత్తుకు ఓకే చెప్పే ప్రసక్తే లేదని ఇరువురూ ప్రకటిస్తున్నారు. కేవలం తమను బద్నాం చేయడానికే ఇలా చేస్తున్నారని సీఎం ఉద్ధవ్ మండిపడుతున్నారు. ఎంఐఎం బీ టీమ్గా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.