ముంబై : యూపీలో బీజేపీ విజయానికి సహకరించిన బీఎస్పీ చీఫ్ మాయావతి, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీలకు భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వాలని శివసేన నేత సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. యూపీలో బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకుందని, అయితే అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ తన స్ధానాల సంఖ్యను మూడు రెట్లు పెంచుకుని 42 నుంచి 125 స్ధానాలకు పెరిగిందని అన్నారు.
బీజేపీ విజయంలో బీఎస్పీ, ఎంఐఎంలు సహకరించాయని వారికి పద్మవిభూషణ్, భారత్ రత్న ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కాషాయ పార్టీ విజయంపై సంజయ్ రౌత్ స్పందిస్తూ బీజేపీ విజయంతో తాము నిరాశకు లోనవలేదని అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందినా ఉత్తరాఖండ్ సీఎం ఎందుకు ఓటమి పాలయ్యారని ప్రశ్నించారు.
పంజాబ్లో కాషాయ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని చెప్పారు. బీజేపీ వంటి జాతీయ పార్టీకి పంజాబ్లో చోటు దక్కకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. పంజాబ్లో ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి సహా బీజేపీ దిగ్గజ నేతలు ప్రచారం చేసినా అక్కడ ఘోరపరాజయం ఎందుకు వాటిల్లిందని నిలదీశారు. యూపీలో కాంగ్రెస్, శివసేనతో పోలిస్తే పంజాబ్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని అన్నారు.