అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎంను మహావికాస్ అగాఢీలోకి తీసుకోమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, సంకీర్ణ ప్రభుత్వంలోకి తీసుకోమని తేల్చి చెప్పారు. అలాంటి అవకాశాలేవీ లేవన్నారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడమంటే అదో రోగం లాంటిదని, ఔరంగజేబుల ముందు మోకరిల్లిన వారితో పొత్తు ఎలా పెట్టుకుంటామని సూటిగా ప్రశ్నించారు. అసలు ఇలాంటి ప్రతిపాదన తమ ఆలోచనల్లోకి కూడా రాదని తేల్చి చెప్పారు. శివసేన ఛత్రపతి శివాజీ స్ఫూర్తితోనే రాజకీయాలు చేస్తుందని రౌత్ ప్రకటించారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో దోస్తీకి తాము రెడీగా ఉన్నామని ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రతిపాదన గురించి ఆలోచించాలని, అయితే ఈ ప్రతిపాదన సంకీర్ణంలో భాగస్వామి అయిన శివసేనకు నచ్చకపోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోందని, నాలుగో పార్టీ కూటమిలోకి వస్తుందని తాము భావించడం లేదని సంజయ్ రౌత్ అన్నారు.