ముంబై : మహారాష్ట్రలో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం ఇంకా కొనసాగుతున్నది. శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి ప్రత్యర్థులపై మండిపడ్డారు. ప్రత్యర్థులు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు బీజేపీ నుంచి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కాంట్రాక్టు తీసుకుందని విమర్శించారు. ఎంఎన్ఎస్ పేరు ప్రస్తావించకుండానే సంజయ్ రౌత్ ఈ ఆరోపణలు చేశారు. ఔరంగాబాద్ ర్యాలీకి సంబంధించి రాజ్ ఠాక్రేపై కేసు నమోదు విషయంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. మహారాష్ట్రపై కుట్ర జరుగుతోందన్నారు. బయట నుంచి జనాలను తీసుకొచ్చి అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారని తమకు తెలుసునని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు దీన్ని సమర్థంగా ఎదుర్కొంటారన్నారు.
ఇక్కడ ఎలాంటి అల్టిమేటంలు పని చేయవని, ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఉందని, మహారాష్ట్రలో అల్టిమేటం రాజకీయాలు పని చేయవచ్చన్నారు. ఇక్కడ థాకరే ప్రభుత్వం మాట మాత్రమే పని చేస్తుందన్నారు. ఇదిలా ఉండగా.. మే 1న ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ఠాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మే 4వ తేదీలోపు మసీదుల నుంచి లౌడ్స్పీకర్లను తొలగించాలని ఉద్ధవ్ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. ‘మే 4 నుంచి మేము వినం. మీరు మీ లౌడ్ స్పీకర్లతో ఇబ్బందిని సృష్టించడం కొనసాగిస్తే, మేము హనుమాన్ చాలీసాను మసీదుల ముందు రెట్టింపు పరిమాణంలో ప్రసారం చేస్తాం’ అంటూ రాజ్ఠాక్రే హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఔరంగాబాద్ పోలీసులు రాజ్ఠాక్రే సహా నలుగురిపై కేసు నమోదు చేశారు.