శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి సహాయపడాలని తనపై ఒత్తిడి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కూల్చడంలో తాను సహకరించనందుకు గాను ఈడీ తనను, తన కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తోందంటూ ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి ఓ లేఖ రాశారు. ప్రస్తుతం ఈడీతో సహా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాజకీయ నేతలకు పప్పెట్లుగా మారిపోయారని విమర్శించారు. మహా వికాస్ అగాఢీని మధ్యలోనే దించేసి, మధ్యంతర ఎన్నికలకు వెళ్లేలా చేశారన్నారు.
తమ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పాలిస్తుందని, ఎవరు భయపెట్టినా, తాను మాత్రం సత్యం మాట్లాడుతూనే వుంటానని రౌత్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసేయాలన్న వంకర బుద్ధితో కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ఓ పద్ధతి ప్రకారం శివసేన నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారని రౌత్ ఆరోపించారు. ఈ విషయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వెంటనే జోక్యం చేసుకోవాలని శివసేన ఎంపీ కోరారు.
‘ఓ నెల క్రితం నన్ను కొంత మంది కలిశారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూలదోసి, మధ్యంతర ఎన్నికలకు వెళ్లడానికి నా సహాయం కోరారు. ప్రభుత్వం కూలదోయడం మొదలు, మధ్యంతర ఎన్నికలు వెళ్లే వరకూ జరిగే ప్రక్రియలో నన్ను కీలకంగా ఉండమన్నారు. ఇలాంటి రహస్య ఎజెండాలో ఎంత మాత్రమూ భాగస్వామి కాదల్చుకోలేదని వారికి నేను తెగేసి చెప్పాను. దీంతో భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుందని వారు నన్ను హెచ్చరించారు. ఓ రైల్వేశాఖ మాజీ మంత్రి ఎలాగైతే జైలు పాలయ్యారో.. అలాగే అవుతారని నన్ను హెచ్చరించారు.’ అని సంజయ్ రౌత్ వెల్లడించారు. 17 సంవత్సరాల క్రితం తన కుటుంబీకులు అలీబాగ్లో ఓ ఎకరం భూమి కొనుగోలు చేశారని, ఈ భూమి అమ్మిన వారిని, వారి కుటుంబీకులను ఇప్పుడు ఈడీ బెదిరిస్తోందని రౌత్ ఆరోపిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వాలని ఈడీతో సహా ఇతర దర్యాప్తు సంస్థలు వారిని బెదిరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.