Shiva sena | శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఒక్క సారిగా యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ఒంటరిగా గోవా బరిలోకి దిగితే మాత్రం పట్టుమని 10 సీట్లను కూడా సంపాదించుకోలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గురువారం విలేకరులతో మాట్లాడారు. గోవాలో కాంగ్రెస్కు ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, ఇంతటి క్లిష్ట సమయంలో తాము, ఎన్సీపీ మద్దతిస్తామని తెలిపామని వెల్లడించారు. తాము ఇలా ప్రతిపాదన పెట్టినా, కాంగ్రెస్ ఏమీ మాట్లాడటం లేదని, అసలు ఏం ఊహించుకుంటుందో కూడా అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఒంటరిగానే కాంగ్రెస్ బరిలోకి దిగితే మాత్రం పట్టుమని పది సీట్లు కూడా సాధించలేదని విరుచుకుపడ్డారు. మరోవైపు గోవాలో కలిసి బరిలోకి దిగాలని శివసేన ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యులతో ఓ సమావేశం నిర్వహించింది. మొత్తం 40 సీట్లకు గాను 30 సీట్లలో కాంగ్రెస్, మిగతా 10 సీట్లలో మిత్రపక్షాలు పోటీ చేయాలన్న ప్రతిపాదనకు వచ్చాయి. అయితే దీనిపై కాంగ్రెస్ ఎలాంటి తుది నిర్ణయమూ తీసుకోలేదు.
మరోవైపు యూపీలో తాము బరిలోకి దిగుతామని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రకటించారు. 50 నుంచి 100 సీట్లలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు. మహారాష్ట్రలో తాము సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నా, యూపీలో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన పేర్కొన్నారు. అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీతో తమకు సైద్ధాంతిక పరమైన విభేదాలున్నాయని, అందుకే ఒంటరిగానే వెళ్తామన్నారు. యూపీలో చాలా కాలంగా తమ ఉనికిని చాటుతూనే ఉన్నామని, అయితే ఇన్ని రోజులు బీజేపీకి ఇబ్బంది కలగొద్దన్న కారణంతోనే బరిలోకి దిగలేదని రౌత్ వివరించారు.