న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ నిష్క్రమణ ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బని కాంగ్రెస్ మాజీ నేత, రాజకీయ విశ్లేషకులు సంజయ్ ఝా వ్యాఖ్యానించారు. కపిల్ సిబల్ గొప్ప న్యాయవాదే కాకుండా అసాధారణ పార్లమెంటేరియన్ అని ఆయన పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తీరుతో విసిగిపోవడంతోనే సిబల్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
సిబల్ సెక్యులర్ నేతని, అందరిని కలుపుకుపోయే నేతగా పేరొందారని, జీ-23 గ్రూప్లో కీలక నేతగా వ్యవహరించారని సంజయ్ ఝా గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన దిశగా అధినాయకత్వం చొరవ చూపడం లేదని ఆయన గ్రహించి ఉంటారని వ్యాఖ్యానించారు. సిబల్, సునీల్ జాఖడ్ వంటి నేతలను కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి దురదృష్టకరమేనని స్పష్టం చేశారు. పార్టీలో ప్రశ్నించే వారితో కాంగ్రెస్ నాయకత్వం సంప్రదింపులు జరపాలని, వారికి పార్టీ పట్ల మమకారం ఉన్నందునే ప్రశ్నిస్తున్నారని గ్రహించాలని హితవు పలికారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు ప్రోత్సహిస్తోందని కుటుంబ రాజకీయాలకు పెద్దపీట వేస్తోందని బీజేపీ దుయ్యబట్టింది. ఇక కపిల్ సిబల్ నుంచి ఇలాంటి నిర్ణయం ఊహించలేదని, ఆయనకు పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, సముచిత గౌరవం కల్పించిందని కాంగ్రెస్ సీనియర్ నేత తారిఖ్ అన్వర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఆకాంక్షలు ఉంటాయని, తన భవిష్యత్ను నిర్ధారించుకునే స్వేచ్ఛ ఆయనకు ఉందని అన్నారు.