Bihar BJP | బీహార్లో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. బీహార్ సీఎం నితీశ్కుమార్ మహాకూటమితో తెగదెంపులు చేసుకుని తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అర్లేకర్ వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీహార్ బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై చర్చలు జరిపింది.
రాష్ట్రంలో జేడీయూతో కలిసి సర్కారును ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ‘ప్రజల సంక్షేమం కోసం బీహార్లో జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం’ అని తీర్మానం చేశారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మీడియాకు వెల్లడించారు.
సమావేశంలో బీహార్ బీజేపీ శాసనపక్ష నేతగా సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నట్లు తావ్డే వెల్లడించారు. అదేవిధంగా విజయ్ సిన్హాను శాసనసభాపక్ష ఉపనేత ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.