తన ఎంపీ పదవికి సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోట్ల మంది యూపీ ప్రజలు తమకు నైతిక విజయం అందించారని, దీనిని తాను పూర్తిగా గౌరవిస్తానని పేర్కొన్నారు. తాను కర్హల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తానని, అయితే.. ఆజంగఢ్ లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టబడే ఉంటానని అఖిలేశ్ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఈ త్యాగం అత్యావశ్యకమని అఖిలేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక అన్యాయం వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఈ త్యాగం అత్యావశ్యకం. అసెంబ్లీ ఎన్నికల్లో కోట్ల మంది ప్రజలు మాకు నైతిక విజయాన్ని అందించారు. దీనిని పూర్తిగా గౌరవిస్తున్నాం. నేను కర్హల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా. ఆజంగఢ్ అభివృద్ధికి కూడా కట్టుబడే ఉంటాను’ అని అఖిలేశ్ ప్రకటించారు.
ఎంపీ అఖిలేశ్ యాదవ్ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కర్హల్ నియోజకవర్గం నుంచి ఆయన విక్టరీ కొట్టన విషయం తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆజామ్ఘర్ ఎంపీగా అఖిలేశ్ ఎన్నికయ్యారు. ఎంపీగా రాజీనామా చేసిన అఖిలేశ్ ఇక నుంచి యూపీ సీఎం ఆదిత్యనాథ్ను అసెంబ్లీలో ఢీకొట్టనున్నారు. 403 స్థానాలు ఉన్న యూపీలో .. అఖిలేశ్ పార్టీ 111 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఒంటరిగా 255 సీట్లు కైవసం చేసుకున్నది.