కర్హల్ ఎమ్మెల్యేగా అఖిలేశ్ యాదవ్ కొనసాగుతారా? లేదంటే ఆజంగఢ్ ఎంపీగా కొనసాగుతారా? యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత అఖిలేశ్ విషయంలో ఇదే ఉత్కంఠత. ఈ ఉత్కంఠతకు అఖిలేశ్ మంగళవారం తెరదించారు. తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి, స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఇకపై ఆయన కర్హల్ ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగనున్నారు. 2027 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే.. అఖిలేశ్ ఇలా చేశారని సమాచారం. దీని బట్టి ఇకపై.. అఖిలేశ్ కేవలం రాష్ట్ర రాజకీయాలపైనే కన్నేశారన్నది తేలిపోయింది.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ ఓడిపోయింది. దాని తర్వాత అఖిలేశ్ 2019 లో లోక్సభకు పోటీ చేశారు. దీంతో యూపీ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపామన్నది సమాజ్వాదీ నిర్ణయించుకుంది. అఖిలేశ్ ఎప్పుడైతే ఎంపీగా గెలిచారో.. అప్పటి నుంచి కేవలం జాతీయ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. రాష్ట్ర రాజకీయాలపై అంత శ్రద్ధ చూపలేదని, ఇదే ఇప్పటి తాజా ఎన్నికలపై ఘోరమైన ప్రభవాన్ని చూపిందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అఖిలేశ్ కంటే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి యూపీ రాజకీయాలపై బాగా ఫోకస్ పెట్టారు. ఎంపీగానే ఉండిపోయిన అఖిలేశ్ కేవలం ట్విట్టర్ పిట్టలాగే మిగిలిపోయారు. దీంతో అఖిలేశ్కు, యూపీ రాష్ట్ర రాజకీయాలకు ఓ గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాపే అసెంబ్లీ ఎన్నికలపై పడిందని, అందుకే పార్టీ ఓటమి పాలైందని ఓ వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది.
హోళీ పండగ సందర్భంగా ములాయం కుటుంబీకులు అందరూ ఒక్కచోట కలుసుకున్నారు. హోళీని ఘనంగా జరుపుకున్నారు. ఇదే సమయంలో సమాజ్వాదీ మార్గదర్శకుడు ములాయం.. అఖిలేశ్తో సహా.. ఇతరులు సమావేశమైనట్లు సమాచారం. అసెంబ్లీలో ఉండాలా? పార్లమెంట్లో ఉండాలా? అని అఖిలేశ్ ఈ సందర్భంగా ములాయంను అడిగారని, ములాయం అసెంబ్లీ వైపే ఉండాలని గట్టిగా చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. అఖిలేశ్ పెద్ద బాబాయ్, సమాజ్వాదీ వ్యూహకర్త రాంగోపాల్ యాదవ్ కూడా అసెంబ్లీలోనే ఉండాలని గట్టిగా చెప్పారట. దీంతో అఖిలేశ్ తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు.