సమాజ్వాదీ మద్దతుతో కపిల్ సిబల్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. మరో ఇద్దర్ని కూడా తాము రాజ్యసభకు నామినేట్ చేస్తామని ప్రకటించారు. అయితే ఆ ఇద్దరి పేర్లను మాత్రం అఖిలేశ్ ప్రస్తావించలేదు.
”కపిల్ సిబల్ పేరు మోసిన లాయర్. పార్లమెంట్లో ఆయన సమర్థవంతంగా సమస్యలను ప్రస్తావించగలరు. సమాజ్వాదీ తరపున, ఆయన తరపున సమస్యలను ప్రస్తావిస్తారని మేము ఆశిస్తున్నాం” అని అఖిలేశ్ ప్రకటించారు.
కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, పేరు మోసిన న్యాయవాది కపిల్ సిబల్ పార్టీకి హఠాత్తుగా రాజీనామా చేసేశారు. చేయడమే కాదు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా… సమాజ్వాదీ పార్టీ మద్దతుతో యూపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ కూడా దాఖలు చేసేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో కపిల్ సిబల్ వెంట సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ కూడా ఉన్నారు.