లక్నో: యోగా గురు రాందేవ్ బాబా.. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గురించి, నటీనటుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్లో భాగంగా గత శనివారం ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో భారీ సభను ఉద్దేశించి మాట్లాడిన బాబా.. తన ప్రసంగంలో డ్రగ్స్ వాడకంపై సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ఖాన్ల పేర్లను ప్రస్తావించి కలకలం రేపారు.
షారూఖ్ ఖాన్ కొడుకు (ఆర్యన్ ఖాన్) ఓ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడని, జైలుకు కూడా వెళ్లాడని, సల్మాన్ ఖాన్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడని, అయితే అమీర్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడో లేదో తనకు తెలియదని రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. అంతేగాక, సినీ పరిశ్రమలో ఎంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారో ఎవరికి తెలుసని, హీరోయిన్లు కూడా ఈ విషయంలో అతీతులేం కారని బాబా వ్యాఖ్యలు చేశారు.
ఎలాంటి ఆధారాలు చూపకుండా రాందేవ్ బాబా ఇంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఎవరూ స్పందించలేదు. ఆఖరికి వాళ్ల పేర్లు ప్రస్తావించినా కూడా సల్మాన్, షారూఖ్ లాంటి బాలీవుడ్ స్టార్లు నోరు మెదపలేదు. దాంతో ఏమో.. రాందేవ్ వ్యాఖ్యల్లో నిజం కూడా ఉందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.