న్యూఢిల్లీ, మే 24: ఎప్పుడో దండయాత్రల సమయంలో ధ్వంసమైన ఆలయాల గురించి ఇప్పడు మట్లాడటంలో అర్థం లేదని ప్రముఖ ఆధ్మాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘దండయాత్రల సమయంలో వేలాది ఆలయాలు ధ్వంసమయ్యాయి. చరిత్రను తిరగరాయలేనప్పుడు.. వాటి గురించి మాట్లాడుకోవడం అర్థరహితం’ అని అభిప్రాయపడ్డారు.
ఒక సమయంలో కేవలం ఒకదానిపైనే చర్చిస్తూ.. వివాదాలు, అనవసరమైన శత్రుత్వ వాతావరణాన్ని కొనసాగించే బదులు రెండు మూడు ముఖ్యమైన స్థలాల విషయంపై హిందువులు, ముస్లిములు కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. భారత్ ప్రస్తుతం కీలక దశలో ఉన్నదని, ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ప్రపంచంలోనే ప్రముఖ శక్తిగా ఎదుగుతామని సద్గురు పేర్కొన్నారు. ప్రతీ విషయాన్ని వివాదం చేసుకుంటూ సమయాన్ని వృథా చేయొద్దని, ఆలయం-మసీదు వివాదాలను మరింత పెద్దది చేయొ ద్దని ప్రజలను, మీడియాను కోరారు. మతపరమైన వివాదాలను రాజకీయ నేతలు పొలిటికల్ మైలేజ్గా చూడొద్దని సూచించారు.
భాషా వివాదంపై..
దేశంలో బీజేపీ రేపిన భాషా యుద్ధంపై సద్గురు స్పందిస్తూ.. భారత్లో అన్ని భాషలకు సమాన స్థానం ఉన్నదని, వైవిధ్యత కూడిన దేశం భారత్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘భాషా ప్రాతిపదికన రాష్ర్టాలను ఏర్పాటు చేసినప్పుడు.. అన్ని భాషలను గౌరవిస్తామనేది ఒక సహజ వాగ్దానం. దయచేసి దాన్ని అలాగే ఉంచండి’ అని కోరారు. ఒక భాషను ఎక్కువమంది మాట్లాడేవారు ఉన్నంత మాత్రాన, దేశ ధర్మాలను, సిద్ధాంతాలను మార్చొద్దని సూచించారు.