న్యూఢిల్లీ : భారత్-కెనడాల (India-Canada Row) మధ్య నెలకొన్న దౌత్యపరమైన ప్రతిష్టంభనతో కెనడాలో నివసించే పౌరుల్లో ఆందోళన నెలకొందని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు, ఎంపీ సుఖ్బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. కెనడాలో నివసించే వారిలో పెరుగుతున్న భయాందోళనలను నివారించేందుకు కెనడాతో స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పడంలో చొరవ చూపాలని బాదల్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన బాదల్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
మొత్తం పరిస్ధితిని దృష్టిలో ఉంచుకుని, ప్రజల్లో భయాందోళనలను నివారించేందుకు తక్షణమే భారత్, కెనడాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు ప్రభుత్వాలను తాను కోరుతున్నానని అన్నారు. ఇరు దేశాల మధ్య ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో కెనడాలో నివసించే భారత సంతతికి చెందిన వారిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సమస్యను సత్వరమే పరిష్కరించని పక్షంలో ఊహించని ప్రతిస్పందనలు ఎదురవుతాయని బాదల్ హెచ్చరించారు. తమ వీసా నిరాకరిస్తే ఏం జరుగుతుందోనని కెనడాలో చదివే పలువురు భారతీయ విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కెనడాలో తమ చదువుల సంగతేంటని పలువురు విద్యార్ధుల నుంచి తనకు కాల్స్ వస్తున్నాయని అన్నారు.
Read More :
India-Canada Row | ఖలిస్తానీ గ్రూపులతో ఐఎస్ఐ ఏజెంట్ల రహస్య భేటీ..!