Punjab Polls: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల్లో బలమైన నేతలను ఓడించడమే లక్ష్యంగా వారికి సమవుజ్జీలను రంగంలోకి దించుతున్నాయి. తాజాగా సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) పార్టీ అదేపని చేసింది.
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఎస్ఏడీ బలమైన నేతను బరిలో దించింది. అమృత్సర్ ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి సిద్ధూపై తమ నాయకుడు బిక్రమ్ సింగ్ మజీతియా పోటీ చేస్తారని శిరోమణి అధ్యక్షుడు సుఖబీర్ సింగ్ బాదల్ వెల్లడించారు. పంజాబ్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సిద్ధూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
కాగా, ఎప్పుడూ బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే శిరోమణి ఈసారి బీఎస్పీతో జట్టుకట్టింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలు ఎస్ఏడీని బీజేపీకి దూరం చేశాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా తలపడుతున్నాయి. మాజీ సీఎం అమరీందర్సింగ్ స్థాపించిన కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ బీజేపీతో జట్టుకట్టింది. ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీకి ఒకే దశలో పోలింగ్ పూర్తికానుంది.