అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణదేవాలయంలోకి శనివారం ఆగంతకుడు చొరబడ్డాడు. సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే గురుగ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో కోపోద్రిక్తులైన భక్తులు అతడిపై దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన అతడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ప్రార్థనల సమయంలో ఆలయం లోపలికి ఓ వ్యక్తి వెళ్లాడు. బంగారు గ్రిల్స్ దాటి, ఖడ్గాన్ని పట్టుకుని, పూజారి గురుగ్రంథ్ సాహిబ్ను పఠిస్తున్న ప్రాంతానికి చేరుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్జీపీసీ కార్యాలయానికి తీసుకెళ్తుండగా, అప్పటికే ఆగ్రహంతో ఉన్న భక్తులు అతడిపై దాడి చేశారు. ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్కు చెందిన వాడని, 30 ఏండ్ల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు. గురుగ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేసేందుకు యత్నించడాన్ని శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు భాయి గురుప్రీత్ సింగ్ తీవ్రంగా ఖండించారు. స్వర్ణ దేవాలయం పవిత్రతపై దాడి జరగడం చాలా బాధాకరమని మాజీ సీఎం ప్రకాశ్సింగ్ బాదల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కుట్ర కోణం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గమైన చర్య అని పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ ఖండించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.