AAP on LG Saxena | ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను తప్పించాలని ప్రధాని నరేంద్రమోదీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కోరింది. ముంబైలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్గా పని చేసినప్పుడు ముంబైలోని ఖాదీ లాంజ్ ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్ట్ను తన కూతురుకు అక్రమంగా కేటాయించారని ఆప్ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ ఆరోపించారు. వీకే సక్సేనా `కేవీఐసీ యాక్ట్ 1961`ని ఉల్లంఘించారని శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. కనుక తక్షణం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా వీకే సిన్హాను తొలగించాలని ప్రధాని నరేంద్రమోదీని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే విషయమై సీనియర్ న్యాయవాదులతో సంప్రదిస్తున్నామని సంజయ్ సింగ్ చెప్పారు. `ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తన తప్పుల నుంచి తప్పించుకోలేరు. నిబంధనలను పాటించకుండా కాంట్రాక్ట్ అప్పగించిన విషయమై త్వరలో మేం కోర్టును ఆశ్రయిస్తాం` అని స్పష్టం చేశారు.`కేవీఐసీ చైర్మన్ తన బంధువుకు ఎలా కాంట్రాక్ట్ అప్పగిస్తారు?` అని ప్రశ్నించారు.
కేవీఐసీ చైర్మన్గా పని చేసినప్పుడు వీకే సక్సేనా ఎటువంటి టెండర్ పిలవకుండానే.. ఖాదీ ముంబై లాంజ్ ఇంటీరియర్ డిజైన్ కాంట్రాక్ట్ను ఎలా అప్పగిస్తారని గురువారం ట్విట్టర్ వేదికగా సంజయ్ సింగ్ ప్రశ్నించారు. దీనిపై రాజ్భవన్ స్పందిస్తూ.. డిజైనర్గా పని చేస్తున్న తన కూతురికి కేవీఐసీ చైర్మన్గా ఉచితంగానే కాంట్రాక్ట్ అప్పగించారని వివరణ ఇచ్చింది. ఫలితంగా లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని పేర్కొంది. కానీ, కేవీఐసీ చట్టం ప్రకారం అధికారులు తమ కుటుంబ సభ్యులకు ఎటువంటి కాంట్రాక్ట్లు ఇవ్వరాదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.