న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను దీటుగా ఎదుర్కొనే కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ అన్నారు. పార్టీ చింతన్ శిబిరం సమాలోచనలకు సన్నద్ధమైన క్రమంలో సచిన్ పైలట్ ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే మేధోమధన సదస్సులో సమర్ధవంతమైన ఎన్నికల వ్యూహం ఖరారు చేయడమే ప్రధాన అజెండా అని వివరించారు.
ఎన్డీఏను మట్టికరిపిచేందుకు యూపీఏ ప్లస్ ప్లస్ కూటమి ఏర్పాటు అవసరమని ఆయన స్పష్టం చేశారు. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోడ్లు, కట్టడాల పేర్లు మారుస్తూ దారిమళ్లించే రాజకీయాలకు తెరలేపుతోందని ఆరోపించారు.
మోదీ హయాంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్మకాయలు కిలో రూ 300కి ఎగబాకాయని, సిలిండర్ రూ 1000కి చేరగా, పెట్రోల్ లీటర్కు రూ 120కి పెరిగి భగ్గుమంటోందని అన్నారు. ప్రజలు ధరల మోతతో అల్లాడుతున్నా మోదీ సర్కార్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని సచిన్ పైలట్ మండిపడ్డారు.