న్యూఢిల్లీ : రాజస్ధాన్లో నాయకత్వ మార్పు వ్యవహారం రాజకీయ రగడకు దారితీసిన నేపధ్యంలో కీలక నేత సచిన్ పైలట్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సచిన్ పైలట్ సమావేశం కానున్నారు.
మరోవైపు గెహ్లాట్. పైలట్ వర్గీయుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జైపూర్లో పర్యటించిన కాంగ్రెస్ పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్లు మరికాసేపట్లో సోనియా గాంధీతో సమావేశమై రాజస్దాన్లో పార్టీ వ్యవహారాలపై లిఖితపూర్వక నివేదికను అందించనున్నారు. ఇక సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాధ్ సైతం రాజస్ధాన్లో పార్టీ వర్గాల నడుమ నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు.
ఇక పార్టీ అధ్యక్ష పగ్గాలను గెహ్లాట్ చేపడితే ఆయన స్ధానంలో సచిన్ పైలట్కు సీఎం బాధ్యతలు అప్పగిస్తే వ్యతిరేకిస్తామని 80 మందికి పైగా గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆదివారం పార్టీ హైకమాండ్కు తెగేసి చెప్పడంతో గెహ్లాట్ తీరుపై అధిష్టానం మండిపడుతోంది. గెహ్లాట్ వర్గానికి చెందిన వ్యక్తే సీఎం పదవి చేపట్టాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. రాజస్ధాన్లో నెలకొన్న పరిణామాల నేపధ్యంలో సోనియా గాంధీతో సచిన్ పైలట్ భేటీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.