హైదరాబాద్: మండల మకర విళక్కు పూజల కోసం శబరిమల ఆలయం నేడు తెరచుకోనుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు గర్భగుడిని పూజారులు తెరవనున్నారు. అయితే మంగళవారం నుంచి భక్తులకు అయ్యప్ప దర్శనమివ్వనున్నాడు. రెండు నెలలపాటు రోజుకు 30వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు.
డిసెంబర్ 26న మండలపూజ ముగుస్తుంది. దీంతో డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఆలయాన్ని మూసివేస్తారు. 30న మకరవిళక్కు కోసం ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వచ్చేఏడాది జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20న పడిపూజ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నట్టు ధ్రువపత్రం లేదా మూడు రోజుల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు.