హైదరాబాద్: అయ్యప్ప స్వామి (Ayyappa Swamy) కొలువై ఉన్న శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం కానుంది. దీంతో నియమ, నిష్టలతో మాల ధరించిన స్వాములు భారీగా శబరి గిరులకు చేరుకుంటున్నారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన తర్వాత కందమల శిఖరంపై దర్శనం ఇచ్చే మరకజ్యోతి (Makarajyothi) కోసం ఎదురుచూస్తారు. సోమవారం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య జ్యోతి దర్శనమివ్వనుంది.
ఈ నేపథ్యంలో భక్తుల కోసం ట్రావెన్కోర్ బోర్డు ప్రత్యేకంగా వ్యూ పాయింట్లను ఏర్పాటు చేసింది. జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి ఇచ్చామని తెలిపింది. అయితే నాలుగు లక్షల మంది వరకు శబరిమలకు చేరుకుంటారని తెలుస్తున్నది. శబరిమల మకరజ్యోతి లేదా మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున దర్శనమిస్తుంది. మకర సంక్రాంతి నాడు ఈ జ్యోతి దర్శనమిస్తుంది కాబట్టి శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు.
శబరిమల అయ్యప్ప ఆలయంలో మొదట 40 రోజుల పాటు కొనసాగిన మండల పూజల సమయంలో భారీగా భక్తులు విచ్చేయడంతో.. ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 వరకు కేవలం 40 రోజుల్లోనే దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి రూ.241 కోట్ల ఆదాయం సమకూరింది.