శివసేన అధికారిక పత్రిక సామ్నా’ వేదిక ద్వారా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని శివసేన మెచ్చుకుంది. హిందూ రాజ్యం గురించి జైపూర్ వేదిక ద్వారా రాహుల్ మాట్లాడటం బాగుందని కితాబునిచ్చింది. గాంధీ హిందువని, గాడ్సే హిందుత్వవాది అని విశదీకరించి చెప్పారని, దీంతో పాటు మరిన్ని విషయాలు కూడా రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారని సామ్నా గుర్తు చేసింది. అయితే ఈ దేశం హిందూ దేశమని రాహుల్ నొక్కివక్కానించడమనేది చాలా ముఖ్యమైన, గమనించాల్సిన అంశమని పత్రికా సంపాదకీయంలో శివసేన పేర్కొంది.
అయితే హిందూ సంస్కృతిని కాపాడటంలో గాంధీ పాత్ర చాల కీలకమని, ఈ విషయాన్ని మాత్రం మరువలేమని సామ్నా పేర్కొంది. చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్ పనికిమాలిన లౌకికవాదం అన్న విషయంలోనే చిక్కుకుపోయిందని, కానీ రాహుల్ మాత్రం హిందుత్వ అంటూ పార్టీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని శివసేన ప్రశంసించింది. ”ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ పనికిమాలిన సెక్యులరిజం అన్న సిద్ధాంతంలో చిక్కుబడింది. కానీ… నేడు రాహుల్ హిందుత్వ అంటూ పార్టీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు” అని సామ్నా పేర్కొంది.