సెయింట్ పీటర్స్బర్గ్: భారతదేశ విదేశాంగ విధానంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ప్రశంసలు కురిపించారు. ఇండియాతో బంధాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. రష్యాతో రిలేషన్ అంశంలో భారత్పై అమెరికా వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించిందని, కానీ ఆ ప్రయత్నాల్లో అమెరికా విఫలమైనట్లు పుతిన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సంబంధాలను అమెరికా బలహీనపరిచే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేటి న్యూస్ ఏజెన్సీలతో పుతిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వృద్ధిని ఆయన ప్రశంసించారు. భారత వ్యక్తిగత విదేశాంగ విధానాన్ని కూడా ఆయన మెచ్చుకున్నారు.
భారత్తో ఆర్థిక సంబంధాన్ని కొనసాగించేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నట్లు పుతిన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, ఆ దేశంలో ప్రస్తుతం ఆర్థిక వృద్ధి ఇంప్రెసివ్గా ఉందని పుతిన్ అన్నారు. రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు వంద బిలియన్ల డాలర్లకు చేరుకోనున్నట్లు ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారత్పై పశ్చిమ దేశాలు వత్తిడి తేవాలని ప్రయత్నిస్తే అది ఆ దేశాలకు బ్యాక్ఫైర్ అవుతుందని పుతిన్ అన్నారు. ఇండియాపై ప్రెజర్ పెట్టాలని అమెరికా ప్రయత్నిస్తోందని, కానీ అత్యధిక జనాభా గల భారత్పై కానీ, మోదీపై కానీ వత్తిడి తేస్తే, అది అంతర్జాతీయ సంబంధాలకు, ద్వైపాక్షిక బంధాలకు విఘాతం అవుతుందని పుతిన్ తెలిపారు.