మాస్కో, ఫిబ్రవరి 18: ఉక్రెయిన్తో పోరులో రష్యా మరో అడుగు ముందుకేసింది. ఉక్రెయిన్లోని అవదివ్కా పట్టణం మొత్తాన్ని రష్యా బలగాలు స్వాధీనంలోకి తెచ్చుకున్నాయని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు ప్రకటించారు. లెఫ్టినెంట్ జనరల్ ఆండ్రీ మోర్డిచెప్ నేతృత్వంలోని సెంటర్ గ్రూప్ దళాలు అవదివ్కాను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తన టెలిగ్రామ్ ఛానెల్లో ప్రకటించిందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
ఉక్రెయిన్ గత 24 గంటల్లో అవదివ్కాలో 15 వందల మంది సైనికులను కోల్పోయిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై ఉక్రేనియన్ సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ మాట్లాడుతూ అవదివ్కా పట్టణం నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఆ విధంగా తమ సైనికుల జీవితాలను కాపాడుకోగలమని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.