నాగపూర్: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ను రష్యా కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా తన సైనిక దళాల్లోకి ఈ అత్యాధునిక క్షిపణి వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. బ్రహ్మోస్ క్షిపణిపై రష్యా ఆసక్తిని కనబరుస్తున్నదని బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జైతీర్థ జోషి తెలిపారు. నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ సంస్థ 100వ స్వదేశీ బూస్టర్ను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. బ్రహ్మోస్ ప్రోగ్రామ్లో రష్యా భాగస్వామ్యమే అయినా, ఈ క్షిపణిని తమ సైనిక దళాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ దేశం ఆసక్తి ప్రదర్శిస్తుందని జోషి తెలిపారు.
బ్రహ్మోస్ అంశంలో రష్యా సర్కారు ఆసక్తితో ఉందన్నారు. ఈ అంశంలో ఆ దేశంతో చర్చలు జరుగుతున్నాయని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్రహ్మోస్ను రష్యా కోరుతున్నట్లు జోషి చెప్పారు. భవిష్యత్తులో రష్యాకు అవసరమయ్యే క్షిపణులను ఇండియా నుంచి పంపిస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. రష్యా తయారీ సంస్థలకు భారతీయ పరిశ్రమలు ఊతం అందిస్తాయన్నారు. రష్యా వద్ద సౌకర్యాలు ఉన్నాయని, కానీ అవి సరిపోకపోవచ్చు అని, ఈ అంశంలో రష్యాతో లోతుగా స్టడీ చేసి, అవసరమైన క్షిపణులను పంపనున్నట్లు జోషి తెలిపారు.
భారత్కు చెందిన డీఆర్డీవో, రష్యాకు చెందిన ఎన్పీవో మషినోస్ట్రోయేనియా సంయుక్తంగా బ్రహ్మోస్ క్షిపణిని డెవలప్ చేస్తున్నాయి. భారత రక్షణ రంగంలో ఇప్పుడు బ్రహ్మోస్ ఓ కీలక ఎగుమతి వస్తువుగా మారింది. బ్రహ్మోస్ క్షిపణికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చిందని, సుమారు 25 ఏళ్ల పాటు సాగిన డెవలప్మెంట్, టెస్టింగ్, ఆపరేషనల్ డెవలప్మెంట్ ఫలితమే బ్రహ్మోస్ అని జోషి పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ను సమర్థవంతంగా వినియోగించినట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ వేళ లైవ్ టెస్ట్ చేశామని, ఆ సక్సెస్ స్టోరీ ప్రపంచం అంతా చూసిందన్నారు.
బ్రహ్మోస్ క్షిపణులను ఖరీదు చేసేందుకు వియత్నాం కూడా ఆసక్తిగా ఉన్నది. అయితే ఆ డీల్కు చెందిన చివరి దశ క్లియరెన్స్లు కావాల్సి ఉందని జోషి అన్నారు. కొన్ని తూర్పు, పశ్చిమ దేశాలు కూడా బ్రహ్మోస్ను ఖరీదు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన చెప్పారు.