ముంబై, మే 13: దేశీయ కరెన్సీ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రూపాయి విలువ పాతాళంలోకి జారుకున్నది. ఇంట్రాడేలో 95.80 కనిష్ఠ స్థాయికి జారుకున్న రూపాయి మారకం విలువ చివరకు ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 95.66 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్ చరిత్రలో రూపాయి ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. దిగుమతిదారులు డాలర్ను ఎగబడి కొనుగోళ్లు జరపడం రూపాయి పతనానికి ఆజ్యంపోశాయని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు. కరెన్సీ పతనాన్ని అడ్డుకట్ట వేయడానికి రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగడంతో చివర్లో కోలుకున్నది. 95.52 వద్ద ప్రారంభమైన డాలర్, రూపాయి ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 95.80 కనిష్ఠ స్థాయిని తాకింది.
చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 2 పైసలు పెరిగి 95.66 వద్ద ముగిసింది. మంగళవారం కరెన్సీ విలువ 40 పైసలు కోల్పోయి చారిత్రక కనిష్ఠ స్థాయి 95.68కి పడిపోయిన విషయం తెలిసిందే. ఆసియాలోనే అత్యంత వరస్ట్ పర్ఫార్మెన్స్ మన కరెన్సీదే కావడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కరెన్సీ విలువ 6 శాతం పతనం చెందింది. ఆర్బీఐ జోక్యంతోపాటు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి నరేంద్ర మోదీ సర్కార్ పసిడి, వెండి దిగుమతులపై సుంకాన్ని 16 శాతానికి పెంచడం రూపాయి పతనానికి పరోక్షంగా దోహదం చేసింది. సమీక్ష భవిష్యత్తులో రూపీ విలువ 95.45 నుంచి 96.15 మధ్యలో పడిపోవచ్చునని ఫారెక్స్ డీలర్ అంచనావేస్తున్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దీర్ఘకాలికంగా కొనసాగితే ఇంధన ధరలను పెంచాల్సి ఉంటుందని రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టంచేశారు. స్విట్జర్లాండ్లో జరుగుతున్న ఒక సమావేశంలో ఆయన మాటాల్డుతూ..పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో చమురు ధరలు భగ్గుమంటున్నాయని, ఆర్థిక పరంగా ప్రభుత్వం ఎన్నో కీలక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అదనపు భారాన్ని తగ్గించుకోవాలంటే వెంటనే ఇంధన ధరలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఇంధన, ఎరువుల దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్న భారత్పై ప్రస్తుతం నెలకొన్న అంతరాలు దేశంపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం చూపనున్నాయన్నారు. ఈ సంక్షోభం దీర్ఘకాలికంగా కొనసాగితే ప్రభుత్వం ధరలను సవరించడం తప్పా వేరే పరిస్థితి లేదని ఆయన స్పష్టంచేశారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చమురు ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.