పుదుచ్చేరి, డిసెంబర్ 16: పుదుచ్చేరిలోని ఎన్డీయే సర్కారులో ముసలం మొదలైంది. ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, బీజేపీ నాయకులు పరస్పరం కత్తులు దూసుకొంటున్నారు. సీఎం రంగస్వామి ఇటీవల ఓ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన నేతృత్వంలోని ప్రాదేశిక ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై రంగస్వామి నేతృత్వంలోని ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్సీఆర్) కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఎదురుదాడికి దిగింది. రంగస్వామి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీపై ధ్వజమెత్తింది. మద్యం అమ్మకాలను తమ పార్టీ దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నదని, రాష్ట్ర శాసనసభలోని 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల వైఖరి కూడా ఇదేనని పుదుచ్చేరి బీజేపీ శాఖ అధ్యక్షుడు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) తయారీకి భూగర్భ జలాలను వినియోగిస్తుండటంతో పుదుచ్చేరిలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. పుదుచ్చేరిలో ఐఎంఎఫ్ఎల్ తయారీ కోసం రంగస్వామి ప్రభుత్వం తాజాగా ఐదు బాట్లింగ్ అండ్ బ్లెండింగ్ యూనిట్ (బీబీయూ)లకు పర్మిట్లుఇవ్వడంతోపాటు, టూరిజం క్యాటగిరీలో 250 మద్యం దుకాణాలను కేటాయించడాన్ని బీజేపీతోపాటు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న ఏఐఏడీఎంకే కూడా తప్పుపడుతున్నది.