Patna : రైల్వే బోర్డు, ఎన్టీపీసీ పరీక్షల ఫలితాలు బిహార్ను కుదిపేస్తున్నాయి. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆ అవకతవకలను నిరసిస్తూ అభ్యర్థులు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వెంటనే వాటిని సరిచేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజీపూర్ ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్రంగా నడుస్తున్నాయి. పాట్నాలో పోలీసులకు, అభ్యర్థులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీసులపై రాళ్లు కూడా రువ్వారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు భాష్పవాయువును కూడా ప్రయోగించారు.
మరోవైపు మహోసల్ గుమ్టి అనే ప్రాంతం వద్ద అభ్యర్థులు రైల్రోకో కూడా నిర్వహించారు. దీంతో పలు రైళ్లు రద్దయ్యాయి. అప్పటికీ రైల్వే పోలీసులు, అధికారులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా చేశారు. అయినా ఆందోళనకారులు వినలేదు. పైగా రైల్వే బోగీలకు నిప్పంటించేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 13 పోస్టుల భర్తీకి గాను ఓ పరీక్ష నిర్వహించింది. వీటిని ఈ నెల 14,15 తేదీల్లో విడుదల చేసింది. ఈ ఫలితాల్లో రిగ్గింగ్ జరిగిందని, అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.