బెంగళూరు, జనవరి 23: వచ్చే లోక్సభ ఎన్నికల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆర్బీ తిమ్మపురపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఒక ఫిర్యాదు అందింది. సమాచార హక్కుల కార్యకర్త దినేశ్ కల్లహళ్లి ఈ ఫిర్యాదు చేసినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. మంత్రి తిమ్మపుర అవినీతి అక్రమాలను నిలువరించాలని, అతని అక్రమ వసూళ్లను అరికట్టాలని దినేశ్ తన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.
ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, తొమ్మిది మంది ఎస్పీలు, 13 మంది డీవైఎస్పీలు, 20 మంది ఇన్స్పెక్టర్ల ద్వారా మంత్రి తిమ్మపుర రూ.18 కోట్ల వరకు వసూలు చేశాడని ఆరోపించారు. బెంగళూరు శివార్లలోని పోలీస్స్టేషన్లలో గత మూడున్నరేండ్లుగా విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ల స్థానంలోకి బదిలీని కోరుతున్న ఇన్స్పెక్టర్ల నుంచి రూ.50 లక్షల వరకు లంచం వసూలు చేశారని పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ల బదిలీల జాబితా ప్రస్తుతం సీఎం వద్ద ఉన్నదని తెలిపారు.