RTC Employees | లక్నో, సెప్టెంబర్ 3: ఉత్తరప్రదేశ్లోని బీజేపీ సర్కారుపై ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేశారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టారు. చాలీచాలని జీతం తాము బతుకీడుస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లక్నోలోని రీజినల్ మేనేజర్ కార్యాలయాన్ని వారు శనివారం చుట్టుముట్టారు. 25 డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని కార్పొరేషన్ జనరల్ మేనేజర్కు అందజేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ రోడ్వేస్ కర్మచారి సంఘ్ పేరిట ఉద్యోగులు ఐక్యవేదికగా ఏర్పడ్డారు.
శ్రమను దోచుకుంటున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం యూపీఆర్టీసీ కార్మికుల శ్రమను దోచుకుంటున్నదని, 2000 తర్వాత ఇప్పటివరకూ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను ప్రభుత్వం చేపట్టలేదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. ఈనేపథ్యంలో తాము సమ్మెకు దిగటం తప్ప మరో మార్గం లేదని ప్రకటించారు. ఏడాది సర్వీస్ పూర్తిచేసుకున్న వారి ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ డ్రైవర్లు, బస్ కండక్టర్లు ఏన్నో ఏండ్లుగా యోగి సర్కార్ను కోరుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమాన పేస్కేల్ అమలుజేయాలని, జాతీయ రహదార్లపై ప్రైవేట్ బస్సుల రాకపోకలు నిలిపివేయాలని, అనుమతిలేని ప్రైవేట్ బస్సులతో కార్పొరేషన్ పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయిందని ప్రభుత్వానికి సమర్పించిన మెమోరాండంలో కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.
తక్కువ వేతనాలతో అష్టకష్టాలు
చాలా తక్కువ వేతనాలు అందజేస్తున్నారని, వీటితో కార్మికుల బతుకు అత్యంత దయనీయంగా మారిందని యూపీ రోడ్వేస్ కర్మచారి సంఘ్ మీడియా ఇన్చార్జ్ రజనీశ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. వేతనాల్ని కనీసం 14 శాతం పెంచాల్సిన అవసరముందని, సమాన వేతనాల్ని అమలుజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మిక వ్యతిరేక పని పరిస్థితులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.