న్యూఢిల్లీ : రామాలయ ప్రారంభోత్సవం జరిగే సమయంలో (Ram Temple Inauguration) జై శ్రీరాం అని నినదించాలని ముస్లింలకు ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆ సమయంలో మసీదులు, దర్గాలు, మదర్సాల్లో శ్రీరాం, జైరాం, జయజయ రామ్ అనే శబ్ధం మార్మోగాలని కోరారు. భారత్కు చెందిన దాదాపు 99 శాతం ముస్లింలు, ఇతర హిందువేతరులు దేశంలో అంతర్భాగమని అన్నారు.
అందుకే మనకు ఉమ్మడి పూర్వీకులున్నందున వారు ఇక ముందూ ఇలాగే ఉంటారని పేర్కొన్నారు. వారు తమ మతం మార్చుకున్నారు కానీ దేశాన్ని కాదని స్పష్టం చేశారు. శాంతి, సామరస్యం, సోదరభావం వెల్లివిరిసేందుకు విగ్రహ ప్రాణ ప్రతిష్ట సమయంలో దేశంలో ఇస్లాం, క్రైస్తవం, సిక్కు ఇతర మతాల వారంతా తమ ప్రార్ధనా స్ధలాల్లో ప్రార్ధనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రామ మందిర్, రాష్ట్ర మందిర్- ఉమ్మడి వారసత్వం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇంద్రేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మనం ఉమ్మడి పూర్వీకులు, ఉమ్మడి ముఖాలు, ఉమ్మడి స్వప్నం ఉందని, మనమంతా ఈ దేశానికి చెందినవారమని, విదేశీయులతో మనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. దర్గాలు, మసీదులు, మదర్సాల్లో శ్రీరాం, జైరాం, జయజయ రాం అంటూ 11 సార్లు అనాలని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఆపై మీ మతాచారాలకు అనుగుణంగా ప్రార్ధనలు చేసుకోవచ్చని చెప్పారు.
Read More :
Tirumala | కొత్త ఏడాదిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు