ముంబై : మహారాష్ట్రలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నారు. మార్కెట్లలో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నాసిక్లో మార్కెట్లలో పెద్దసంఖ్యలో ప్రజలను ప్రవేశించకుండా నిరోధించేందుకు బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. మార్కెట్లో కస్టమర్ ఎవరైనా గంటకు మించి గడిపితే రూ 500 జరిమానా విధిస్తూ జిల్లా ఎస్పీ దీపక్ పాండే ఉత్తర్వులు జారీ చేశారు.
మార్కెట్లలో ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. నాసిక్ జిల్లాలో కరోనా వైరస్ కేసులు 1,74,682కు మించడంతో అధికారులు మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు చేపట్టారు. జిల్లాలో 2847 తాజా కేసులు వెలుగుచూడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.