గౌహతి: సుమారు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్ను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. అసోంలోని కరీంగంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎక్సైజ్ శాఖ సిబ్బంది పలు చోట్ల నిర్వహించిన దాడుల్లో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జూనిటిల్లాలోని పోలీస్ రిజర్వ్ గ్రౌండ్లో ‘డ్రగ్స్ డిస్పోజల్ ప్రోగ్రాం’ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దాడుల్లో స్వాధీనం చేసుకున్న 3.162 కిలోల హెరాయిన్, 1,11,256 కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ బాటిళ్లు, 2,172 కిలోల గంజాయి, 4,51,505 యాబా మాత్రలను గ్రౌండ్లో వరుసగా పేర్చారు. అనంతరం రోడ్డు రోలర్తో తొక్కించి వాటిని ధ్వంసం చేశారు. ధ్వంసమైన ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.40 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.