ప్రధానమంత్రి మోడీ గురువారం అసోంలో పర్యటించారు. డిబ్రూఘడ్, డిఫూలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, డిబ్రూఘడ్ సభకు జనాలను తరలించేందుకు 1002 బస్సులను ఏర్పాటుచేశారు. వీటికి అద్దె కింద చెల్లించిన మొత్తం 4.73 కోట్లు. అలాగే, డిఫూ సభకు జనాలను తరలించేందుకు 6,146 బస్సులను వినియోగించారు.
వీటికి అద్దె కింద 23.89 కోట్లు. అంటే ఈ రెండు సభలకు కలిపి జనాలను తరలించేందుకు దాదాపు రూ. 29 కోట్లు ఖర్చు చేశారు. అల్ట్రా, ట్రావెలర్, మ్యాజిక్ బస్సులు, సుమోలు, డీలక్స్ బస్సులను జనాలను తరలించేందుకు ఉపయోగించారు. కాగా, ప్రధాని సభకు జనాలను తరలించేందుకు ఇంత మొత్తంలో ప్రజాధనాన్ని వృధా చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తే బాగుండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.