న్యూఢిల్లీ: ఇంకా ప్రజల వద్ద రెండు వేల నోట్లు (2,000 Notes) ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7,755 కోట్ల విలువైన రెండు వేల నోట్లు ఉన్నట్లు పేర్కొంది. చెలామణిలో లేని ఈ నోట్లలో 97.82 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయని సోమవారం వెల్లడించింది. రూ.2,000 నోట్ల చెలామణిని ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించింది. ఆ సమయంలో రూ.3.58 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు సర్క్యూలేషన్లో ఉన్నాయి. అయితే 2024 మే 31 నాటికి ఇంకా ప్రజల వద్ద ఉన్న రెండు వేల నోట్ల విలువ రూ.7.755 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ సోమవారం తెలిపింది. 2023 మే 19 నుంచి ఇప్పటి వరకు 97.82 శాతం నోట్లు తిరిగి వచ్చాయని పేర్కొంది.
కాగా, చెలామణిలో లేని రెండు వేల నోట్లను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడం లేదా మార్చుకునే సౌకర్యం దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్లలో 2023 అక్టోబర్ 7 వరకు అందుబాటులో ఉంది. 2023 మే 19 నుంచి రిజర్వ్ బ్యాంక్ 19 కార్యాలయాల్లో కూడా రూ.2000 నోట్ల మార్పిడి సౌకర్యం ఉంది. 2023 అక్టోబరు 9 తర్వాత కూడా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ కోసం ఈ నోట్లను ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు స్వీకరిస్తున్నాయని ఆర్బీఐ తెలిపింది. ఇంకా కొంతమంది పోస్ట్ ద్వారానూ రూ. 2000 నోట్లను పంపుతున్నారని వెల్లడించింది.
మరోవైపు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల ద్వారా రూ.2,000 నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి జరుగుతున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కాగా, 2016 నవంబర్లో పాత రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేయడంతో కొత్తగా రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టారు. అయితే 2023 మే 19 నుంచి వీటిని కూడా చెలామణి నుంచి వెనక్కి తీసుకున్నారు.