IT raids @ Jarkhand | జార్ఖండ్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు రూ.2 కోట్ల నగదు బయటపడింది. అలాగే, దాదాపు రూ.100 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, ఇన్వెస్టుమెంట్లు లభించాయి. కాంగ్రెస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సహా వారి అనుచరుల ఇండ్లపై దాడులు చేపట్టిన అధికారులు.. అక్కడ దొరికిన నగదు కట్టలను చూసి విస్తుపోయారు. ఈ దాడులు నాలుగు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తున్నది. అయితే, ఎంత మొత్తం నగదు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఐటీ శాఖ ఇంతవరకు వెల్లడించలేదు.
జార్ఖండ్కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైమంగళ్సింగ్, ప్రదీప్ యాదవ్తోపాటు వారి అనుచరుల ఇండ్లలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. జార్ఖండ్తోపాటు బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని రాంచీ, గోడ్డా, బెర్మో, డుంకా, జంషెడ్పూర్, చాయ్బసా, పట్నా, గురుగావ్, కోల్కతా వంటి 70 ప్రదేశాల్లో ఐటీ దాడులు జరిగినట్లు ఐటీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. వివిధ కంపెనీల ద్వారా సంపాదించిన ఆదాయాన్ని ప్రభుత్వానికి చూపకుండా ఆ నగదుతో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం, స్థిరాస్థి కొనుగోలు చేయడం వంటి కార్యకలాపాలకు పూనుకున్నట్లు అధికారులు గుర్తించారు.
బొగ్గు వ్యాపారం, రవాణా, ఇనుప ఖనిజం, స్పాంజ్ ఇనుము ఉత్పత్తి చేస్తున్న కంపెనీల్లో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో రూ.2 కోట్ల నగదును గుర్తించారు. అలాగే, దాదాపు రూ.100 కోట్ల మేర లెక్కల్లో చూపని పెట్టుబడులు, లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. మొత్తం 16 బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తున్నది. ఈ నెల 21 న విచారణకు హాజరుకావాలని తనకు అధికారులు సమాచారం ఇచ్చినట్లు ఎమ్మెల్యే జైమంగళ్ సింగ్ మీడియాకు తెలిపారు.