న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation, One Election) విధానాన్ని అమలు చేస్తే ప్రతి 15 ఏళ్లకు కేవలం ఈవీఎంలకే పది వేల కోట్లు ఖర్చువుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ప్రతి 15 ఏళ్లకు కొత్త ఈవీఎంలను సమకూర్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ పంపింది. ఎన్నికల సంఘం (ఈసీ) నివేదిక ప్రకారం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే, కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (ఈవీఎం) కొనుగోలు చేయడానికి ప్రతి 15 సంవత్సరాలకు రూ.10,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసింది. ఈవీఎంల జీవిత కాలం 15 సంవత్సరాలని పేర్కొంది. మూడు సార్లు ఎన్నికల నిర్వహణకు ఒక సెట్ ఈవీఎంను వినియోగించవచ్చని తెలిపింది.
కాగా, ఈ ఏడాది లోక్సభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా సుమారు 11.8 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఈసీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ప్రతి పోలింగ్ స్టేషన్కు రెండు సెట్ల ఈవీఎంలు (ఒకటి లోక్సభ స్థానానికి, మరొకటి అసెంబ్లీ నియోజకవర్గానికి) అవసరమవుతాయని తెలిపింది. పని చేయని ఈవీఎంల స్థానంలో నిర్దిష్ట సంఖ్యలో అదనపు ఈవీఎంలతోపాటు ఈవీఎంల సంఖ్యకు అనుగుణంగా కంట్రోల్ యూనిట్లు (సీయూలు), బ్యాలెట్ యూనిట్లు (బీయూలు), ఓటర్-వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) మెషిన్లు అవసరమని ఈసీ పేర్కొంది.
మరోవైపు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఏకకాల ఎన్నికలకు అవసరమైన కనీస ఈవీఎంలతోపాటు 46,75,100 బీయూలు, 33,63,300 సీయూలు, 36,62,600 వీవీపీఏటీలు అవసరమవుతాయని ఈసీ తెలిపింది. 2023 నాటి రేట్ల ప్రకారం బీయూ ధర రూ. 7,900, సీయూ ధర రూ. 9,800, వీవీపీఏటీ యూనిట్ రూ. 16,000 కలుపుకుని ఒక్కో ఈవీఎం యూనిట్ ధర రూ.33,700గా అంచనా వేసింది.
కాగా, అదనపు పోలింగ్ బూత్ల ఏర్పాటు, భద్రతా సిబ్బంది, ఈవీఎంల భద్రతా స్థలాలు, వాహనాలు కూడా అవసరమని ఈసీ తెలిపింది. అలాగే రాజ్యాంగంలోని ఐదు ఆర్టికల్స్ను సవరించాలని పేర్కొంది. ఈ స్థాయిలో ఈవీఎంలు సమకూర్చుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటే 2029లో దేశవ్యాప్తంగా ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించవచ్చని వెల్లడించింది. ఒకే దేశం, ఒకే ఎన్నికకు సంబంధించి న్యాయ మంత్రిత్వ శాఖ అడిగిన ప్రశ్నలకు గత ఏడాది ఫిబ్రవరిలో ఈ మేరకు ఈసీ నివేదిక ఇచ్చింది.