న్యూఢిల్లీ: రాష్ట్రాలకు లక్ష కోట్ల వరకు వడ్డీ రహిత రుణాలు అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంట్లో మంగళవారం కేంద్ర బడ్జెట్ ప్రవేశం సందర్భంగా ఆమె వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రాష్ట్రాలకు సహాయం చేయడానికి రూ. లక్ష కోట్లు కేటాయిస్తామని తెలిపారు. ఈ నిధులు 50 ఏండ్లు వడ్డీ రహిత రుణాలని చెప్పారు. రాష్ట్రాలకు అనుమతించిన సాధారణ రుణాల కంటే ఇవి ఎక్కువని అన్నారు. ప్రధాన మంత్రి గతి శక్తికి సంబంధించిన అభివృద్ధి పనులు, రాష్ట్రాల ఇతర ఉత్పాదక మూలధన పెట్టుబడులకు ఈ నిధులు ఉపయోగపడతాయని వివరించారు.
2022-23 సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.48,000 కోట్లు కేటాయించినట్లు సీతారామన్ తెలిపారు. అలాగే కొత్త స్పెషల్ ఎకనామిక్ జోన్స్(SEZ) చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఎంటర్ప్రైజ్, హబ్ల అభివృద్ధితోపాటు ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ఎన్క్లేవ్లకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఎగుమతుల పోటీతత్వాన్ని కూడా ఈ కొత్త సెజ్ చట్టం పెంచుతుందని చెప్పారు.