న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఒకసారి ఆమోదాన్ని నిలుపుదల చేసిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను ప్రస్తావించింది. 10 పెండింగ్ బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి, ఎంకే స్టాలిన్ సర్కార్ మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించేందుకు న్యాయస్థానం శుక్రవారం పలు కీలక సూచనలు చేసింది. ప్రతిష్ఠంభనను పరిష్కరించేందుకు సీఎం స్టాలిన్తో సమావేశమై చర్చించాలని గవర్నర్ రవిని కోరింది. సీఎంతో కలసి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొంటే అభినందిస్తామని పేర్కొన్నది. ‘బిల్లుల ప్రతిష్ఠంభనకు గవర్నర్ తెరదించాలని కోరుకుంటున్నాం. ఈ విషయంలో సీఎంతో కలిసి నడిస్తే మేం అభినందిస్తాం. సీఎంను గవర్నర్ ఆహ్వానించి, ఆయనతో కూర్చొని పెండింగ్ బిల్లుల విషయంపై చర్చలు జరుపుతారని ఆశిస్తున్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం పేర్కొన్నది. బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ రవి జాప్యం చేస్తున్నారని పేర్కొంటూ స్టాలిన్ సర్కార్ను వేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది.
తిప్పిపంపిన బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపిందని, అయితే ఆ బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకొన్నది. గవర్నర్ రవి మొండిగా వ్యవహరిస్తున్నారని సింఘ్వీ ఆరోపించారు. రెండోసారి ఆమోదించి పంపిన బిల్లులను కూడా ఎక్కువ కాలం తొక్కిపెట్టిన గవర్నర్.. వాటిని గత నెల 28న రాష్ట్రపతికి పంపారని కోర్టుకు తెలిపారు. ఇది స్పష్టమైన రాజ్యాంగ ఉల్లంఘనేనని వాదించారు. రాజ్భవన్ తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలు వినిపించారు. గవర్నర్ బిల్లులను తిప్పిపంపినప్పుడు, వాటిని ఆమోదాన్ని నిలుపుదల చేయలేదని, పునఃపరిశీలన కోసం మాత్రమే పంపారని అన్నారు. బిల్లుపై తమ వైఖరి మార్చుకోవడం లేదని అసెంబ్లీ చెప్పిన సమయంలో.. గవర్నర్ అప్పుడు దాన్ని రాష్ట్రపతికి పంపవచ్చని వాదించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం గవర్నర్ అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్-200ను ప్రస్తావిస్తూ.. మొదటిసారి అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతికి గవర్నర్ పంపొచ్చని, అయితే వాటిని తిప్పిపంపి, అసెంబ్లీ మరోసారి ఆమోదించిన సమయంలో మాత్రం రాష్ట్రపతికి పంపే అధికారం లేదని స్పష్టం చేసింది. ‘ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు మూడు ఎంపికలు ఉంటాయి. బిల్లును ఆమోదించవచ్చు లేదా ఆమోదాన్ని నిలుపుదల చేయవచ్చు లేదా రాష్ట్రపతికి పంపవచ్చు. అయితే ప్రస్తుత సందర్భంలో మాత్రం ఆమోదాన్ని నిలుపుదల చేశానని గవర్నర్ మొదట చెప్పారు. ఒకసారి ఆమోదాన్ని నిలిపివేసిన తర్వాత.. సంబంధిత బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేసే ప్రశ్నే ఉండదు. బిల్లును నిలుపుదల చేయలేరు’ అని న్యాయస్థానం పేర్కొన్నది. ఆమోదాన్ని నిలుపుదల చేసిన తర్వాత బిల్లును గవర్నర్ తిరిగి అసెంబ్లీకి పంపకుంటే.. అది బిల్లును పూర్తిగా నిరర్థకం చేయడమేనని వ్యాఖ్యానించింది. కాగా, గత విచారణ సందర్భంగా తమిళనాడు గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బిల్లుల ఆమోదంపై మూడేండ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం మెట్లు ఎక్కే వరకు ఏం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది.