న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఊరట దక్కలేదు. ఎక్సైజ్ పాలసీకి చెందిన మనీల్యాండరింగ్ కేసులో ప్రస్తుతం ఆయన జుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ కస్టడీని ఏప్రిల్ 23వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు తెలిపింది. స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఈ కేసులో ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 23వ తేదీన కేజ్రీవాల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరుచాలని కోర్టు తెలిపింది. మద్యం విధానం కేసుతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ ఆరోపిస్తున్నది. ఈ కేసులో ఆయన్ను మార్చి 21వ తేదీన అరెస్టు చేశారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 29వ తేదీన ఉంటుందని కోర్టు చెప్పింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఆదేశాలు జారీ చేసింది.