Manish Sisodia | లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాకు కస్టడీ పెరోల్ దక్కింది. ఆనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను వారానికి ఒకసారి కలుసుకునేందుకు వీలుగా ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఆయనకు కస్టడీ పెరోల్ ఇచ్చింది.
మనీశ్ సిసోడియా తన భార్యను చూసేందుకు వెళ్లినప్పుడల్లా ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ కూడా అందుబాటులో ఉండాలని కోర్టు పేర్కొంది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సిసోడియాకు ఈ కస్టడీ పెరోల్ వెసులుబాటు కొనసాగతుందని న్యాయస్థానం తెలిపింది.
అదేవిధంగా మనీశ్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ కోసం వేసిన పిటిషన్పై విచారణను కోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియా పిటిషన్పై వాదనలు విననున్నట్లు ప్రకటించింది.