Road Accident | ఉత్తర్ప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమాండర్ జీపులను పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం మేరకు.. మంగళవారం ఉదయం డోకాటి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛాప్రా మలుపునకు సమీపంలో వేగంగా వచ్చిన వాహనం రెండు కమాండర్ జీపులను ఢీకొట్టింది. దాంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతులంతా ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
మృతులను భగవాన్పూర్ వాసులుగా గుర్తించారు. మసూమ్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖేజురీకి వెళ్లి వస్తుండగా సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టమటా లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. క్షతగాత్రుల కేకలు విన్న పలువురు వాహనదారులు పోలీసులు, అంబులెన్స్లకు సమాచారం అందించారు. ఘటన అనంతరం డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సోన్బర్సాకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు.