Road accident : మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్ర (Maharastra) లోని సోలాపూర్-పుణె (Solapur-Pune) జాతీయ రహదారిపై మొహోల్ (Mohol) దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. గాయపడ్డ మహిళను మొహోల్లోని ఆస్పత్రిలో చేర్పించారు. బాధితులు పన్వెల్ నుంచి అక్కల్కోట్కు దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.