Road accident : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెయిన్పురిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నారి నామకరణ కార్యక్రమం కోసం వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురికి పరిస్థితి విషమంగా ఉంది.
బేల్ధార గ్రామానికి చెందిన వీరేంద్ర సింగ్ లోధి తన మనవడి నామకరణ కార్యక్రమం కోసం 35 బంధువులను తీసుకుని శుక్రవారం ట్రాక్టర్ ట్రాలీలో స్థానికంగా ఉన్న ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం రాత్రికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ హెడ్లైట్ లోపం తలెత్తింది.
దాంతో లోపాన్ని సరిదిద్దేందుకు డ్రైవర్ ట్రాక్టర్ను పక్కకు అపాడు. అదే సమయంలో అటుగా వచ్చిన లారీ ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ ట్రాలీ రోడ్డుపక్కన పడిపోయింది. అందులో ఉన్న మహిళల్లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్లో మొత్తం 35 మంది ఉండగా.. అందులో 25 మంది ఆడవాళ్లే ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.