న్యూఢిల్లీ : రామాయణంపై ఆర్జేడీ (RJD) ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామాయణాన్ని మసీదులో రాశారని దనపూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే యాదవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మసీదులో కూర్చుని రామాయణం రాశారని, మరి అప్పుడు హిందుత్వ ప్రమాదంలో పడలేదా అని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
ఇదంతా హిందుత్వలో భాగమని మీరు అనుకుంటే పార్టీ నుంచి ముస్లింలందరినీ బయటకు పంపండని అన్నారు. 11 ఏండ్ల ముస్లిం బాలిక భగవద్గీతను పఠించి మెడల్ను గెలుచుకున్నప్పుడు హిందుత్వవాదులు నోరుమెదపలేదని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలెవరూ ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని భాగస్వామ్య పార్టీ జేడీ(యూ) పేర్కొంది.
ఇక ఆర్జేడీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఆర్జేడీ, జేడీయూ సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నాయని కాషాయ పార్టీ మండిపడింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అనుసరించే సనాతన ధర్మాన్ని విమర్శించడం అజ్ఞానానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ఇక అంతకుముందు రామాయణం పుస్తకం విద్వేషాన్ని వెదజల్లి, సమాజాన్ని విడదీస్తుందని బిహార్ విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Read More