RJD : బీహార్లో లోక్సభ స్థానాలకు ఆర్జేడీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. బీహార్లో మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉండగా మహాకూటమి ఒప్పందంలో భాగంగా ఆర్జేడీకి 23 స్థానాలు దక్కాయి. ఈ క్రమంలో ఆ పార్టీ 22 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక్క సివాన్ స్థానానికి ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సివాన్ లోక్సభ స్థానం నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మహ్మద్ షాబుద్దీన్ చాలాకాలంగా ఆర్జేడీ అభ్యర్థిగా బరిలో దిగుతూ వస్తున్నారు. ఈసారి ఆయన లేకపోవడంతో ఆ సీటు ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఆర్జేడీ సమాలోచనలు చేస్తోంది.
అయితే, తాజాగా ఆర్జేడీ ప్రకటించిన 22 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఆయన ఇద్దరు కుమార్తెలు చోటు దక్కించుకున్నారు. లాలూ చిన్న కుమార్తె రోహిణి ఆచార్య సరాన్ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. 2013లో దాణా కుంభకోణంలో దోషిగా తేలే వరకు ఆ స్థానంలో రోహిణి తండ్రి లాలూ యాదవ్ ఎంపీగా ఉన్నారు. ఇక ఇప్పటికే రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎంపికైన లాలూ పెద్ద కుమార్తె మిసా భారతి.. ఈసారి లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. పాటలీపుత్ర నుంచి పోటీకి ఆమె సిద్ధమయ్యారు.
కాగా, బీహార్లోని మొత్తం 40 లోక్సభ స్థానాలకుగాను మహాకూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీకి 26 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి 9, వామపక్షాలకు 5 స్థానాలు కేటాయించారు. అయితే గత వారం బీహార్ మాజీ మంత్రి ముకేశ్ సాహ్నికి చెందిన వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి, ఆర్జేడీకి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఆర్జేడీ తన కోటాలోని మూడు స్థానాలను ఆ పార్టీకి ఇచ్చింది. మిగిలిన 23 స్థానాల్లో ఆర్జేడీ పోటీ పడనుంది.