న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బెయిల్ మంజూరయ్యింది. లాలూ యాదవ్తోపాటు ఆయన భార్య రబ్రీ దేవికి, కుమార్తె, ఎంపీ మిసా భారతికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తుపై లాలూ యాదవ్, మిసా భారతి, రబ్రీ దేవిలకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది.
కేసు తదుపరి విచారణను మార్చి 29న జరపనున్నట్లు కోర్టు పేర్కొంది. రైల్వే ఉద్యోగాలకు బదులుగా కొందరి నుంచి భూములు తీసుకున్నట్లుగా లాలూ, రబ్రీ, మిసా భారతిపై ఆరోపణలున్నాయి. ఇవాళ వారి బెయిల్ పిటిషన్పై విచారణ కోసం నిందితులు ముగ్గురూ కోర్టుకు హాజరయ్యారు. లాలూ యాదవ్ వీల్ చైర్లో కోర్టు రూమ్కు వెళ్లారు.
రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో లాలూ యాదవ్, ఆయన కుటుంబసభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇచ్చేందుకు బదులుగా కొంతమంది నుంచి వారు తక్కువ ధరకే భూములను కొన్నట్లు ఆ కేసుల్లో ఆరోపణలున్నాయి. ఈ కేసులో ప్రస్తుతం నిందితులు ముగ్గురికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.